పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాంతాల్లో రెండు విచిత్ర ఘటనలు జరిగాయి. రెండూ పోలీసులంటే భయంతో జరిగినవే కావడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని లజపతిరాయ్పేటలో నిన్న ఉదయం జనం పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో పోలీసులు వస్తున్నట్టు సైరన్ రావడంతో వారికి దొరక్కుండా ఉండేందుకు తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు.
దీంతో వేండ్ర వీరాంజనేయులు (57) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అతను మరణించినట్లు ఆ తర్వాత వైద్యులు ధృవీకరించారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో జరిగిన మరో ఘటనలో పసుమర్తి భాస్కరరావు (55) పోలీసు వ్యాన్ సైరన్ విని తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు ప్రకటించారు.