కరోనా వైరస్ కారణంగా అమెరికాలో దాదాపుగా రెండు లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంథోనీ ఫౌసీ తెలిపారు. ప్రస్తుతం కనిపిస్తున్న దాన్ని బట్టి ఈ అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణించినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. ఇది క్షణ క్షణానికి మారుతున్నందున అంచనాలు తప్పు కూడా కావచ్చునని ఆయన అన్నారు. జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపుగా లక్షా 25 వేల కరోనా ఖరారైన కేసులు అమెరికాలో ఉన్నాయని తేలింది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, వయో వృద్ధులకు ఇది మరిన్ని సమస్యలు తెస్తుందని వారు వెల్లడించారు.
ఆదివారం రాత్రి వరకూ అమెరికాలో 2,188 మరింది కోవిడ్ 19 వైరస్ కారణంగా మరణించారు. న్యూయార్క్ మహానగరం, న్యూజెర్సీ, కనెక్టికట్ నగరాలను పూర్తిగా క్వారంటైన్ చేయాలన్న ఆలోచన పై కూడా ఉన్నతాధికారులు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడుతున్నారు. ఆచరణ యోగ్యమైన విధానం అవలంబించాలని ఆయన చెప్పినట్లు ఫౌసీ తెలిపారు.