ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి కి తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతనిస్తున్నదని ఆమె తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు తీసుకున్నామని, మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
2019 మే ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో ప్రజలు అధికారం అప్పగించారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో భారత అభివృద్ధికి పనిచేస్తున్నామని ఆమె అన్నారు. ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని నిర్మల తెలిపారు.
యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయని, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం అని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుందని ఆమె అన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొని ఉందని ఇది దేశానికి ఉపయుక్తంగా ఉందని ఆమె అన్నారు.