దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో వాడుక భాషలు అయిన తెలుగు, ఉర్దూ కనుమరుగు అయే పరిస్థితి ఉందని దీన్ని ఎట్టిపరిస్థితులో సహించేది లేదని జమతే ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ హెచ్చరించారు.
బుధవారం నాడు విజయవాడ లబ్బిపేట లోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భాష కనుమరుగైతే మన సంస్కృతి కూడా కనిపించకుండా పోతుందని ఆయన అన్నారు. గతంలో వై.యస్.రాజశేఖర రెడ్డి ఉర్దూ మీడియం అభివృద్ధికి కృషి చేశారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాషను అంతమొందించే విధంగా ముందుకు వెళుతున్నారని రఫీక్ అన్నారు.
జి.ఓ నెం.81, 85 ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని ఆదేశాలు పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం విద్య ను ప్రవేశపెట్టడం ద్వారా అరచేతిలో వైకుంఠంచూపుతున్నదని ఆయన అన్నారు. ఎవరు ఏ భాషలో చదివితే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎలా పొందారో ఒక అధ్యయనం చెయ్యాలి అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్నఉపాధ్యాయులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకుండా ఏ విధంగా ఇంగ్లీషు మీడియం అమలు చేయగలరు అని ప్రశ్నించారు.