కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున పూట గడవని నిరుపేదలు తిండి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన కోనేరు సాయితేజ 5 క్వింటాళ్ల గోధుమలు 100 మంది నిరుపేదలకు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎత్తోండ గ్రామ టీఆరెస్ అధ్యక్షుడు కిషోర్ పటేల్….. కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలకు, కూలీలకు చేతినిండా పనిలేక పూటగడవటమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పూట గడవని నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చి 100 మందికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 5 క్వింటాళ్ల గోధుమలు పంపిణీ చేసిన కోనేరు సాయితేజ ను అభినందించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయన్నారు.
పేదప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరేందుకు సాయితేజ లాంటి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు,పోలీసులకు సహకరించాలని,ఎవ్వరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని కోరారు. అందరూ సామాజిక దూరం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అరగంటకో సారి చేతులు మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రై స స అధ్యక్షుడు కిషోర్ బాబు, ఎత్తోండ సర్పంచ్ సాయిబాబు, ఎంపీటీసీ ఫారూఖ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, ఎస్సై మచ్చెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.