మున్సిపల్ ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకున్న ఘనత టీఆర్ఎస్కు మాత్రమే దక్కిందని ఆయన అన్నారు.
దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డని ఆయన అన్నారు. అదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలోని మొత్తం మున్సిపాలిటీల్లో కూడా గెలువబోతున్నామని ఆయన జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల విషయంలో బీజేపీ నేతలు గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.
కేంద్రం సంవత్సరానికి కేవలం 6 నుంచి 7 వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం బిక్ష కాదు, మన హక్కు అని ఈటెల అన్నారు. ఆ మాత్రం దానికే వేల కోట్లు ఇస్తున్నామనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు.