లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు వాలంటీర్లు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు.
జిల్లాలో మొత్తం 400 మందికి పైగా పోలీసులను సంప్రదించారు. వాలంటీర్లుగా అందరికీ అవకాశం ఇవ్వకుండా వారి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. ఇందుకు 35 ఏళ్ల లోపు ఉన్న యువకులు, ఎన్సీసీ కేడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు సంబంధించిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
కరీంనగర్ సీపీ కార్యాలయంలో ఫైనల్ చేసిన యువత లిస్టును వివిధ శాఖలకు పంపిస్తున్నారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్ ల వద్ద సామూహిక దూరం పాటించేలా వీరి ఉయోగించుకోవాలని భావిస్తున్నారు.
అలాగే రోడ్డు స్టాపర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కూడా వాలంటీర్లను నియమించి వాహనాలను దారి మళ్లించేలా వారికి బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ కూరగాయల మార్కెట్ వద్ద వాలంటీర్ల సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.