కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనుల వద్ద జిలెటిన్స్టిక్స్ పేలడంతో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. దీంతో మృతదేహాలను గుర్తించలేకుండా ఉంది.
ఘటనాస్థలాన్ని పోరుమామిళ్ల సీఐ మోహన్ రెడ్డి, కలసపాడు, పోరుమామిళ్ల ఎస్ఐలు మద్దిలేటి, మోహన్ పరిశీలించారు. మృతులను కలసపాడు మండలంలోని గంగాయపల్లెకు చెందిన ప్రసాద్(35), పులివెందుల వాసులైన ప్రసాద్(40), సుబ్బారెడ్డి(40), బాల గంగులు(35), వెంకటరమణ(25)గా గుర్తించారు. పలువురి వివరాలు తెలియాల్సి ఉంది. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భూకంపంగా భావించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం జగన్ ఆరా
కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు దుర్మరణం చెందటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దీనికి గల కారణాలను ఉన్నతాధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతిచెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.