రాజధాని హైదరాబాద్ లో ఎంతకూ అదుపులోకి రాని కరోనాను కట్టడి చేసేందుకు హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించి కఠిన ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం జంటనగరాలు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 100 వరకూ హై రిస్క్ జోన్లను గుర్తించినట్లు తెలిసింది.
మెహదీపట్నం, యూసుఫ్ గూడ, అంబర్ పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఈ జోన్లను హైరిస్క్ జోన్లుగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కొక్క జోన్ లో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తద్వారా హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకుండా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజు సరాసరిన 1,250 మంది నగరవాసులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 500 కేసులకంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లగా పరిగణిస్తున్నారు. ఇలాంటి జోన్లు నగరంలో 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.