రాష్ట్రంలో కొత్తగా 1,000 మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. మూడు నెలల్లో కొత్త సభ్యత్వాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన మత్స్యకారులకు మార్కెటింగ్ సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ సమావేశమై కొత్త మత్స్యకార సంఘాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కారుల నుంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వాలు వారి డిమాండ్ పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ కొత్తగా 1000 మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అర్హులైన ప్రతీ మత్స్య కారుడికి సంఘ సభ్యత్వం పొందడం హక్కు. అందుకే ప్రభుత్వం కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేసి మత్స్య కారులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసే 650 మత్స్య సహకార సంఘాల్లో సభ్యులకు నైపుణ్య పరీక్షలు పూర్తయ్యాయి. మరో 334 సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. 18 ఏండ్లు నిండిన మత్స్య కారులకు మార్కెటింగ్ సోసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీని వల్ల 18 ఏండ్లు నిండిన మత్స్యకారులకు ప్రభుత్వం పథకాలకు అర్హులు అవుతారు అని తెలిపారు. 650 మత్స్య సహకార సంఘాల్లో 13 వేల 900 మందికి సభ్యత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మరో 334 సంఘాల్లో సభ్యత్వం కోసం నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సంఘాల్లో మరింత మంది మత్స్యకారులకు సభ్యత్వం లభించనుంది. మూడు నెలల్లో ఈ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని మత్స్య శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సభ్యత్వ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.