వనపర్తి జిల్లా ఉమ్మడి వీపనగండ్ల మండల పరిధిలోని సుమారు 35 గ్రామాలకు వైద్య సౌకర్యార్థం గత 60 సంవత్సరాలుగా కొనసాగుతున్న వీపనగండ్ల ప్రభుత్వ హాస్పిటల్లో నేటికీ ఎమర్జెన్సీ వైద్యం నిమిత్తం 108 అంబులెన్స్ వాహనం కేటాయించకపోవడం దురదృష్టకరమని చిన్నంబావి ,వీపనగండ్ల మండల తాసిల్దార్ల కు శాంతిలాల్ , యేసయ్య లకు ఉభయ మండలాల ప్రజలు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు వైద్యం నిమిత్తం సుదూర ప్రాంతాలైన వనపర్తి ,కర్నూల్, నాగర్ కర్నూల్, హైదరాబాదు లాంటి ప్రాంతాలకు అత్యవసర వైద్య చికిత్స కోసం నాటి నుండి నేటి కి 108 అంబులెన్స్ వాహనం కేటాయించకపోవడంతో సుమారు 55 వేల జనాభాకు ప్రజలకు ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోయిందని వారు అన్నారు.
దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత రెండు సంవత్సరాల క్రితం నుండి స్థానిక ఎమ్మెల్యే అంబులెన్స్ మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇట్టి విషయంపై పలుమార్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక 108 వాహనాలను కేటాయించిన, వీపనగండ్ల ప్రభుత్వ హాస్పటల్ కి మాత్రం 108 వాహనం కేటాయించక పోవడంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వీపనగండ్ల, చిన్నంబావి మండల పరిధిలో నూతన 108 ప్రభుత్వ అంబులెన్స్ వాహనాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ చిన్నంబావి, వీపనగండ్ల మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
గొందిమల్ల వెల్లటూరు సాధన సమితి నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్, ఆరెకటిక సంఘం పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్జీ, సిపిఎం నాయకులు కుమార్, పుల్లయ్య, కొల్లాపూర్ నియోజక వర్గ గ్రాడ్యుయేట్స్ కన్వీనర్ చాపల సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.