జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనే అంశంపై టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రచ్చ జరుగుతుండటంతో ఈ ప్రాంతంలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం ఎల్ ఏ గా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని కొందరు, టి ఆర్ ఎస్ నాయకుడు ఎం ఎల్ ఏ గా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని మరొకరు వాదులాడుకుంటున్నారు.
టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఒకరిపై ఒకరు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మండలంలోని కొయ్యూరులో కమ్యూనిటీ హాల్ లో మండల అభివృద్ధితో పాటు జరిగిన అవినీతిపై సై అంటే సై అని పత్రిక ముఖంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసిన కాటారం సిఐ హాథిరామ్ నాయక్, కొయ్యూరు ఎసై ఇస్లావత్ నరేష్ ఉన్నతాధికారుల అదేశాల మేరకు మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మండలంలో ప్రశాంత వాతావరణంలో ఉండేలా ఇరు పార్టీల పెద్దలతో మాట్లాడి చర్చలు రద్దు చేసి మండలంలో144సెక్షన్ విధించారు. మండలంలోని తాడిచెర్ల, కొయ్యూరు గ్రామాల్లో చిరు వ్యాపారుల దుకణాలతో పాటు ఆయా పార్టీల అధ్యక్షులను గృహానిర్బంధం చేశారు.
ప్రధాన కూడలో ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండి గుంపులు గుంపులుగా ఉంటే కేసులు పెడతామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎసై నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.