ఒక ఆవు కడుపులో పేరుకుపోయిన 12 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్ లను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం పరిధిలోని మల్లేశ్వరం గ్రామానికి చెందిన రైతు పైలా ఈశ్వరయ్య కు చెందిన ఆవు అస్వస్థతకు గురి కావడంతో వెటర్నరీ వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు.
వారు పరీక్ష చేయడంతో ఆవు కడుపులో ప్లాస్టిక్ చెత్త ఉన్నట్లు తెలిసింది. దాంతో ఆవుకు ఆపరేషన్ చేసి 12 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. కొల్లాపూర్ పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో పశు వైద్యులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ భాను కిరణ్, డాక్టర్ అశ్విని, డాక్టర్ యాదగిరి (1962 అంబులెన్సు) ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెటర్నరీ ఏడి డాక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ పశువులకు ఈ విధంగా ప్లాస్టిక్ బ్యాగులు ఇతర వస్తువులు దగ్గర ఉంచడం వల్ల పెను ప్రమాదం వస్తుందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు దగ్గర ఉండకుండా రైతులు జాగ్రత్త పడాలని ఆయన అన్నారు. పర్యావరణానికి చెడుచేసే ప్లాస్టిక్ కవర్లను పొరబాటున తినడం వల్ల పశువులు అస్వస్థతకు గురి అవుతాయని ఆయన అన్నారు.