దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ముయాన్కు వచ్చిన బెజూ ఎయిర్ ఫ్లైట్ కు చెందని 7C2216 బోయింగ్ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. రన్ వే పై రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు. ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజూ విమానయాన సంస్థ ప్రకటించింది. కాగా, విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానం రన్వేకు తగిలింది. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్ వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయని తెలిపారు. దట్టమైన నల్లని పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.