పశ్చిమబెంగాల్ లో తీవ్ర విషాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంతిమయాత్ర వాహనం ఢీకొని 18 మంది ప్రాణాలను కోల్పోయారు. నడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుమారు 35 మందితో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
చక్డా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా అతని కుటుంబసభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని తీసుకుని నవద్వీప్ శ్మశానవాటికకు మినీ ట్రక్కులో బయలుదేరారు. తెల్లవారుజామున వారి ట్రాక్కు హన్షకలీ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది.
ఈ ఘటనలో ట్రక్కులోని 12 మంది అక్కడకక్కడే చనిపోగా మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.