ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అత్యంత అవమానకర రీతిలో పంపించిన తర్వాత కొత్తగా ఆ పోస్టులోకి ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1984 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారిణి నీలం సహానీ పేరు దాదాపుగా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నీలం సహానీ విధినిర్వహణలో అత్యంత కటువుగా వ్యవహరించే అధికారిణిగా పేరు పొందారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిజాయితీగా నిర్ణయాలు తీసుకునే ఐఏఎస్ అధికారిణిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన నీలం సహానీ ప్రస్తుతం కేంద్ర సర్వీసులో పని చేస్తున్నారు. ఆమె నిర్వర్తించిన పూర్వ బాధ్యతలను పరిశీలించి కేంద్రంలో అత్యంత కీలకమైన కేంద్ర విజిలెన్స్ కమీషనర్ సెక్రటరీగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతను అత్యంత సమర్ధంగా నిర్విర్తించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా నిర్వర్తించే విధంగా నీలం సహానీ ఉంటారు. నీలం సహానీ విధి నిర్వహణను పెద్ద బాధ్యతగా స్వీకరిస్తారు. ఏ నిర్ణయమైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పి చేయడం అలవాటు ఉన్న అధికారిణిగా ఆమె పేరు పొందారు. నీలం సహానీ కనుక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరిస్తే పాలనను గాడిలో పెట్టేందుకు వీలుకలుగుతుందని పలువురు ఐ ఏ ఎస్ అధికారులు కూడా భావిస్తున్నారు. నీలం సహానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో కీలకమైన పోస్టులలో పని చేశారు. అప్పటిలో చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండే ఐఏఎస్ అధికారులలో ఒకరిగా నీలం సహానీ పేరు పొందారు. ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించే లక్షణం ఉన్నందున చంద్రబాబునాయుడు కూడా నీలం సహానీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.
previous post
next post