రెండు దశాబ్దాలకు పైగా ఎదురుచూస్తున్న తమ కల సాకారం చేయాలని 1998 డిఎస్సి అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహ్మద్ అజీజ్ పాషా అన్నారు. 1500 మంది అభ్యర్థులు సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఉద్యమ సమయంలోనూ, సిఎం అయిన తర్వాత కూడా కెసిఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ 1998 డిఎస్సి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చిందని,తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడి అభ్యర్థులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి వారికి న్యాయం చేయాలని అన్నారు.
అభ్యర్థులను వెంటాడుతున్న శాపం
1998లో చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి,తొలుత జారీ చేసిన జీవో 221లో రాత పరీక్షకు కటాఫ్ మార్కులు ఓసి కి 50,బిసి కి 46,ఎస్సి, ఎస్టి,వికలాంగ అభ్యర్థులకు 40 లను నిర్ణయించారని,ఇంటర్వ్యూలకు పిలిచేందుకు కొన్ని కేటగిరీల్లో సరిపోను అభ్యర్థులు లేరనే సాకుతో కటాఫ్ మార్కులను తగ్గిస్తూ జివో 618 ని జారీ చేశా రని,ఈ జీవోలను ఆసరాగా చేసుకుని కొంతమంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారని అన్నారు.221 జివో కింద అర్హత సాధించిన మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేశారనే ఫిర్యాదులొచ్చాయని,618 జివో కింద అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడంతో మెరిట్ సాధించిన అభ్యర్థులు రోడ్డున పడ్డారని,బాధితులు 24 సంవత్సరాల నుండి పోరాడుతున్నారని అన్నారు.
సూత్రప్రాయంగా అధికారిక ప్రకటన
ఉద్యమ సమయంలో కెసిఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారని,రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో తెలంగాణ భవన్లో అభ్యర్థులతో చర్చలు కూడా జరిపారని గుర్తు చేశారు. అభ్యర్ధులకు పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అప్పట్లో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశంలోను,అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన చేశారని,తదుపరి అది ముందడుగు పడలేదని అజీజ్ పాషా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ ఆ రాష్ట్రానికి చెందిన డిఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని, వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసుగా పరిగణించి న్యాయం చేస్తానన్న సిఎం కెసిఆర్ కూడా తన మాట నిలబెట్టుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారని అన్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా ఆదుకుంటానని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆ దిశగా నిర్ణయం తీసుకొని వెంటనే వారికి పోస్టింగ్ ఇవ్వాలని అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,ముషం సత్యనారాయణ, వీరారెడ్డి, జగన్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్