రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో సకల జనుల సమ్మెకు రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో ఈ గ్రామాలలో అన్ని కార్యక్రమాలు బంద్ చేస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకల జనుల సమ్మెకు సహకరించాలని రాజధాని అమరావతి జేఏసీ కోరింది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయకుండా తమకు సహకరించాలని వారు కోరారు.
29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సకల జనుల సమ్మె చేపడతున్నట్లు జెఏసి తెలిపింది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రైతులే జోలే పట్టు రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరిస్తామని జెఏసి ప్రకటించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి తాము సహకరిస్తామని, రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి రాజధానిని నిర్మించవచ్చునని వారు తెలిపారు.