ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. దీపం – 2 స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ. 867 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో అందించే ఈ రెండో ఉచిత సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ సంబంధిత సంక్షేమ శాఖలకు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్కు రూ.16,330 లక్షలు, ఎస్టీ కార్పొరేషన్కు రూ.3,870 లక్షలు, బీసీ సంక్షేమ శాఖకు రూ.46,522 లక్షలు, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 14,582 లక్షలు, మైనారిటీ సంక్షేమ శాఖకు 5,396 లక్షలు చొప్పున కేటాయించింది. ఈ బడ్జెట్ వినియోగంపై తగిన మార్గదర్శకాలను సూచిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత సిలిండర్లను అందజేస్తున్నారు.