భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) 2020లో తన విజయపరంపరలను కొనసాగించింది. ఓ వైపు కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్నప్పటికీ విజయవంతంగా ఈ సంవత్సరంలో మూడు రాకెట్ల ద్వారా ఆయా ఉపగ్రహాలను నింగిలోకి పంపి తన సత్తా చాటింది. ఇప్పటికే ఇస్రోను తమ ప్రయోగశాలగా మార్చుకున్న అనేక దేశాలు ఇక్కడి సక్సెస్ రేట్ కారణంగా మన అంతరిక్ష కేంద్రాల నుంచే వారి శాటిలైట్లను కూడా పంపుతుండడంతో ఇస్రోకు, దేశానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఓ వైపు ఆదాయమేగాకుండా మరోవైపు పేరు ప్రఖ్యాతల్లో కూడా ఇస్రో పేరు మారుమోగిపోతుండడం విశేషం. ఏది ఏమైనా అత్యంత కఠినమైన పరిస్థితులు తలెత్తిన 2020లో కూడా ఇస్రో విజయాల పరంపరను కొనసాగించడంతో అన్ని దేశాల చూపు భారతదేశంపై పడడం విశేషం.
జనవరి -17న జీశాట్-30
జనవరి 17న ఏరియన్ ఐదు వాహక నౌక జీశాట్-30ని 2.35 గంటలకు నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు కాగా ఈ ఉపగ్రహం ద్వారా టెలివిజన్ ప్రసారాలు, టెలికమ్యూకిఏషన్, బ్రాడ్కాస్టింగ్లలో మరింత నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఇస్రో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇన్శాట్-4ఏ స్థానాన్ని జీశాట్-30 భర్తీ చేయనుందని అప్పట్లో ఇస్ర్తో చైర్మన్ డాక్టర్ శివన్ ప్రకటించారు.
నవంబర్-7న ఈవోస్-1
అనంతరం విజయాల పరంపరను కొనసాగిస్తూ నవంబర్ 7న ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్ఎల్వీ సీ49 ద్వారా ఈవోస్-1ను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ద్వారా ఏకంగా పది ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రవేశపెట్టడం విశేషం.
630 కిలోల బరువు ఉన్న పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రనస్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్–2, లక్జెంబర్గ్కు చెందిన కేఎస్ఎం–1ఏ, కేఎస్ఎం–1బీ, కేఎస్ఎం–1సీ, కేఎస్ఎం–1డీ, అమెరికాకు చెందిన లిమూర్ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) ఉపగ్రహాన్నిమన దేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందించనుండడం విశేషం. ఈ ప్రయోగం అద్భుతమైనదని కోవిడ్-19 తీవ్రతరం అయిన నేపథ్యంలో ఒకేసారి పది ఉపగ్రహాలను నింగిలోకి పంపడం తమకు ఛాలెంజింగ్గా మారిందని అయినప్పటికీ విజయవంతంగా ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయగలిగామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.
డిసెంబర్ 17న సీఎంఎస్-01
ఇక అత్యంత ప్రతిష్టాత్మకైన 2020లో చివరి ప్రయోగమనే చెప్పుకోవాలి సీఎంఎస్-01ను షార్ నుంచి డిసెంబర్ 17వ తేదీన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు కాగా ఈ ప్రయోగంతో సీ-బ్యాండ్ సేవల విస్తరణ సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనున్నట్లు శాస్ర్తవేత్తలు వెల్లడించారు. జీశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది.