భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జూన్ నాలుగున జరగనున్న ప్రజాగర్జన సభకు ఖమ్మంజిల్లా నుంచి 300 బస్సులు పెద్ద సంఖ్యలో ఇతర వాహనాల ద్వారా ప్రజలు తరలనున్నట్లు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. ప్రతి సిపిఐ కార్యకర్త బహిరంగ సభకు హాజరయ్యేవిధంగా కృషి జరుగుతుందన్నారు.
ఖమ్మం నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఖమ్మం టూటౌన్, వన్టన్ ప్రాంతంలోని పలు వార్డుల్లో పర్యటించి బహిరంగ సభకు తరలి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పోడు భూములు సహా పలు సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ సభను
నిర్వహిస్తున్నామని ప్రసాద్ తెలిపారు. 25 వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్త ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం
హేమంతరావు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొంటారన్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీని నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాల్గొంటారని ప్రసాద్ తెలిపారు.
ప్రచార కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎస్ జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ సలాం, కార్పొరేటర్ చామకూరి వెంకన్న, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, యానాలి సాంబశివరెడ్డి, సైదా, మోహన్ రావు, జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.