వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మేజర్ కాలువలోకి దూసుకెళ్ళిన సంఘటన గుంటూరు జిల్లా హైవే రోడ్డు పరిధిలో గల రొంపిచర్ల లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు లో నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులందరూ కూలీలు.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి నుండి ఎపి27 బియస్ 0959అనే నంబరు గల కారులో మాధవ్ జగదీష్ గౌడ్ పాలాజీఆనంద్ కటకం మహేష్ అనే ఐదుగురు ప్రకాశం జిల్లా పామర్రు గ్రామానికి వెళ్ళుతున్నారు.
హైవే రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు స్దానిక తంగెడమల్లె మేజర్ కాలువ సమీపంలోకి రాగానే అదుపుతప్పి మేజర్ కాలువలోకి దూసుకెళ్ళింది. కాలువలోకి దూసుకెళ్ళిన కారు కుడోర్లు లాక్ పడటంతో బయటకు వచ్చేందుకు వీలుపడకపోవటంతో ఊపిరాడక కారులో ఉన్న జగదీష్ గౌడ్(37)శివం(9)పాలాజీఆనంద్(37)కటకం మహేష్(38)మృతి చెందారు.
కారు డ్రైవర్ ఓనర్ అయిన మాధవ్ కారుఅద్దాలు పగులకొట్టుకొని తీవ్రగాయాలతో బయటపడ్డారు. మృతులందరూ జగిత్యాల మండలం ధర్మపురి గ్రామానికి చెందారు. వీరందరూ టాపీ కార్పెంట్ పనులు చేస్తుకొంటూ జీవిస్తున్నారు. వీరి మేస్త్రీ మాధవ్ ప్రకాశం జిల్లా పామర్రు గ్రామంలో గల రమణయ్య ఇంటి పనుల నిమిత్తం కారు లో తీసుకెళ్ళుతుండా ఈ ప్రమాదం జరిగింది.
సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్దానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ ఐ హజరత్తయ్య పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగినతీరును స్దానికులను అడిగితెలుసుకున్నారు.
మేజర్ కాలువలో ఉన్న కారును బయటకు తీయించి మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతుల బంధువులకు సమాచారం తెలియజేశారు. తీవ్రగాయాలైన మాధవ్ ను చికిత్స నిమిత్తం నరసరావుపేట లో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.