గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నవారిలో 49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్ఫజీజీ) వెల్లడించింది.
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకుని విశ్లేషించినప్పుడు ఈ విషయం బహిర్గతమైందని ఎఫ్జీజీ కార్యదర్శి యం. పద్మనాభరెడ్డి తెలిపారు.
మొత్తం 96 కేసుల్లో 49 మంది అభ్యర్థులు నిందితులుగా ఉన్నారని చెప్పారు. అయితే, గత గ్రేటర్ ఎన్నికల్లో ఆయా పార్టీలు 72 మంది నేరచరితులకు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మంది నేరచరిత్ర కలిగిన వారికే టికెట్లు ఇవ్వడం ఒకింత శుభపరిణామని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని పధ్మనాభరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరిత కలిగిన అభ్యర్థులు పార్టీల వారీగా టీఆర్ఎస్-13, బీజేపీ-17, కాంగ్రెస్-12, మజ్లిస్-07 మంది ఉన్నారు.
ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురి మహిళా అభ్యర్థులపైనా కేసులున్నాయని ఎఫ్జీజీ వెల్లడించింది. మొత్తం గ్రేటర్లో నేరచరిత్ర కలిగిన వారు పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య 41 కాగా ఒక్క మల్కాజ్గిరి వార్డు(140)లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉందని పద్మనాభరెడ్డి తెలిపారు.