ఒక వైపు కరోనాతో ఎవరు బతికి ఉంటారో ఎవరు చస్తారో తెలియడం లేదు. మరో వైపు మూడు రాజధానుల పేరుతో కొందరు అనుకూలంగా మరి కొందరు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా సంక్లిష్టంగా ఉన్న ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట రావుకు అద్భుతమైన ఐడియా వచ్చింది.
తన ఆరాధ్య దైవం అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి గుడి కట్టిస్తే ఎలా ఉంటుందని ఐడియా రావడంతోనే అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరిగే సమయంలోనే జగన్ గుడికి కూడా శంకుస్థాపన చేయాలని నిర్ణయించి చేసేశారు.
కుటుంబ సమేతంగా ఆయన చేసిన ఈ పని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని నవ్వుల పాలు చేస్తున్నది. ఇప్పటి వరకూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడారు ఇప్పుడు జగన్ మతంపై చర్చ జరుగుతున్నది. జగన్ పై అభిమానం ఉంటే చర్చి కట్టుకోవాలి కానీ గుడి కట్టడం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కూడా ప్రశ్నిస్తున్నారు.
కరోనా వైరస్ నిర్మూలనకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని చూసి ఆయనే రాష్ట్ర ప్రజలను కాపాడగల దేవుడు అనే ఉద్దేశ్యంతో ఇలా గుడికట్టిస్తున్నట్లు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు చెబుతున్నాడు. ఇలాంటివి తెలిసిన తర్వాత అయినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆపాల్సి ఉంటుంది.
అయితే ఆయన కూడా తనకు గుడి కట్టాలని అనుకుంటున్నారేమో తెలియదు. ఇప్పటి వరకూ గడి కట్టడం ఏమిటి ఆపండి అని ఆయన ఆదేశించలేదు. ఇలాంటి పనులు చేసేవారిని నిలుపుదల చేయకపోతే చర్చ మరింత పెరుగుతుంది. అప్పుడు నష్టం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికే. ఇప్పటికే జగన్ గుడి విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తతున్నాయి.