కరోనా లాక్ డౌన్ తొలి దశలో గుజరాత్ లో చిక్కుకుపోయి నానా అవస్థ పడిన ఉత్తరాంధ్ర వలస మత్స్య కారులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది.
గుజరాత్ లో వారు పని చేస్తున్న కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్టర్ మళ్లీ పనిలోకి రావాల్సిందిగా వత్తిడి తెస్తున్నాడు. అంత దూరం వెళ్లి పని చేసేందుకు మత్స్యకారులు ఇష్టపడటంలేదు.
ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి తమ సమస్య విన్నవించారు.
లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలు మరచిపోలేనిదని వారు మంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్య నుంచి కూడా గట్టెక్కించాలని వారు మంత్రిని కోరారు.
అయితే తాము మళ్లీ రావాల్సిందిగా గుజరాత్ ఫిషింగ్ హార్బర్ ప్రెసిడెంట్ తులసి బాయ్ అడుగుతున్నాడని, అక్కడకు వెళ్లడం తమకు ఇష్టం లేదని వారు మంత్రికి వివరించారు.
విముఖతతో ఉన్న కళాసీలు మళ్లీ అక్కడకు వెళ్లాలంటే కొన్ని డిమాండ్లు చేస్తున్నారని వారు మంత్రికి తెలిపారు. భవిష్యత్ లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడానికి ప్రతి తండేలుకు బోటు యజమాని రూ.10వేలు ముందుగా చెల్లించాలని వారు కోరారు.
అదే విధంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా చేయించాలని, ప్రమాదవశాత్తూ చనిపోతే మృతదేహాన్ని వారే ఇంటికి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్య బీమా తో బాటు ఏదైనా అనారోగ్యం వస్తే మొత్తం ఖర్చు బోటు యజమాని భరించాలని వారు కోరారు. ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
విషయాలన్నీ పరిశీలించి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడతానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని ఉత్తరఆంధ్ర వలస మత్స్య కారులు సంక్షేమ సమితి అధ్యక్షులు మూగి అప్పన్న తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య కార సహాకార సొసైటీ ప్రెసిడెంట్ కోనాడ నర్సింగ్ రావు, మత్స్య కార ఎస్ టి సాధన సమితి సభ్యులు మూగి గురు మూర్తి (న్యాయవాది), సురాడ కన్నబాబు, మైలపల్లి పోలీస్ పాల్గొన్నారు.