వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. భూవివాదం కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేగా ఉండి తన నియోజకవర్గ ప్రజల హక్కులను రక్షించాల్సిన పిటిషనర్..చట్టవ్యతిరేకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రజలను బెదిరించి, వారి ఆస్తులను లాక్కోవడం తీవ్రమైన అంశమే.
ఇటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే విచక్షణాధికారాన్ని వినియోగించలేమంటూ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు ఉత్తర్వుల్లో న్యాయాధికారి కామెంట్ చేశారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వంశీ…భూవివాదాన్ని పరిష్కరిస్తానని పిలిచి, తన బినామీల పేర్ల మీద ఆ భూమిని రాయించుకున్నారని విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, సీతామహాలక్ష్మి దంపతులు ఇటీవల గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని A-1గా చేర్చారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడలోని 12వ ADJ కోర్టులో వంశీ వేసిన పిటిషన్పై గత వారం వాదనలు పూర్తయ్యాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ న్యాయాధికారి భాస్కరరావు.. తీర్పు చెప్పారు. ఓ కేసులో వంశీకి నూజివీడు సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని..ఆయన న్యాయవాది పేర్కొన్నారు. ఆ కోర్టు ఉత్తర్వులకు మేం కట్టుబడి ఉండాలని లేదన్నారు. రెండూ వేర్వేరు కేసులని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి ఎగువ కోర్టుల నిర్ణయాలనే పరిగణనలోకి తీసుకుంటాం.
వంశీ పేరు డాక్యుమెంట్లలో ఎక్కడా లేదని, అయినా కేసు నమోదు చేశారని అతని తరఫు న్యాయవాది వాదించారు. కానీ దీని వెనుక సూత్రధారి వంశీ అని ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించింది. ఆయన అనుచరులను పెట్టి బినామీ పేర్లతో సేల్ డీడ్లు రాయించుకున్నారని, దీని వెనుక వ్యవహారం వెలుగులోకి రావాలంటే కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని APP వాదించారు.
ఇటువంటి తీవ్రమైన కేసుల్లో ఈ దశలో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయాధికారి భాస్కరరావు తన 16 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తరఫున సీనియర్ న్యాయవాది కిలారు బెనర్జీ, ప్రాసిక్యూషన్ తరఫున కల్యాణి, నిందితుడి తరఫున దేవి సత్యశ్రీ వాదించారు.