వామ్మో, ఈ ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఉండాలి. నిజం, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఒక ఫ్రెండ్ చేతులో మల్లేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇదేదో ఆస్తి తగాదా కాదు, అక్రమ సంబంధం అంతకన్నా కాదు మరి మల్లేష్ ను ఆ ఫ్రెండ్ ఎందుకు చంపేశాడా అని ఆలోచిస్తున్నారా? సింపుల్.
మల్లేశా నాకు మందు ఇప్పిచ్చు, అన్నాడు. మల్లేష్ ఇప్పించలేదు. దాంతో హత్య చేసేశాడు. ఆశ్చర్యం, ఆందోళన కలిగించే ఈ సంఘటన ఈ నెల 14న మధ్యాహ్నం 3.30కి కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పెంట్లవెల్లి గ్రామ శివారులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం అక్కడి చెరువు కట్ట వద్ద పెంట్లవెల్లి గ్రామానికి చెందిన మల్లేష్ ఎలియాస్ మల్లయ్య చౌట చెరువు కట్టమీద కూర్చొని ఉండగా అదే గ్రామానికి చెందిన రాజేష్ అతని దగ్గరికి వచ్చి మద్యం ఇప్పించమని అడిగాడు. అతడి కోరికను మల్లేష్ తిరస్కరించినoదుకు రాజేష్ రాయితో మల్లేష్ పై దాడి చేశాడు.
రాయితో ఉదర భాగంలో బలంగా కొట్టాడు. కిందపడేశాడు. దాంతో మల్లేష్ కట్టక్రింద గుంతలో రాళ్లపై పడ్డాడు. తలకు బలమైన గాయం తగలడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. మల్లేష్ చికిత్స పొందుతూ 17వ తేదీ సాయంత్రం మరణించాడు. మల్లేష్ భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం నిందితుడు రాజేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని ఆయన తెలిపారు.