కరోనా సమయంలో పిల్లల చదువు పెద్ద సమస్యగా మారింది కదా? మీరు అవునన్నా కాదన్నా మీ పిల్లల చదువు పెద్ద సమస్యే. అందులో సందేహం లేదు. కరోనా వ్యాప్తికి అత్యంత ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాలుగా క్లబ్బులు, పబ్బులు, సినిమాహాళ్లతో బాటు పాఠశాల తరగతి గదులు కూడా ఉన్నాయి.
అందువల్ల పిల్లల్ని స్కూలుకు పంపడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆన్ లైన్ క్లాస్ లు. అంతే కదా? అయితే ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో కార్పొరేట్ కాలేజీలు దోపిడి చేస్తున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అన్ని రకాల ఫీజులూ వసూలు చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో చదివే సమయంలో స్కూల్ డ్రెస్ ఎందుకు?
అయినా సరే స్కూల్ డ్రెస్ తో సహా కొనుక్కోవాల్సిందే. వీటన్నింటికి డబ్బులు చెల్లించాల్సింది. అసలే కరోనా సమయం. చాలా మంది తల్లిదండ్రులకు ఉద్యోగాలు పోయాయి. ఆదాయం లేదు. రోజు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించేందుకు వీలుకాక, చెల్లించలేక తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. దీనికి పరిష్కారం ఉంది. మీ పిల్లల్ని ఏ స్కూల్ లో లేదా ఆన్ లైన్ క్లాసుల్లో ఈ ఏడాది చేర్పించవద్దు.
‘‘హోం ట్యూషన్’’ కాన్సెప్టు
ఈ ఏడాది వరకూ ప్రయివేటు గానే చదివించండి. ఏ క్లాస్ అయినా ఫర్వాలేదు. ఇంటి వద్దనే ఉంటూ చదువుకునే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు విద్యారంగ నిపుణుడు, ఐఐటీ జెఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్. ఏ తరగతి చదువుతున్న పిల్లలను అయినా సరే ఈ ఏడాది వరకూ ప్రయివేటు అభ్యర్ధిగా చదివించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మరి చదువుకునేది ఎలా?
దానికి పరిష్కారంగా ‘‘హోం ట్యూషన్’’ కాన్సెప్టును అవలంబించాలని ఆయన చెబుతున్నారు. నలుగురు లేదా ఐదుగురు లేదా పది మంది విద్యార్ధులు కలిసి ఒక టీచర్ ను మాట్లాడుకోవాలి. వీలుఉన్నవారి ఇంటివద్ద వీరంతా కలిసి కూర్చుని పాఠాలు నేర్చుకోవచ్చు. నిర్ణీత సమయంలో, భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి రిస్కు లేకుండా చదువుకోవచ్చు. ఇలా సబ్జెట్ కు ఒకరి చొప్పున టీచర్లను హోం ట్యూషన్ కు మాట్లాడుకోవచ్చు.
చాలా కార్పొరేట్ కాలేజీలు టీచర్లను, లెక్చరర్లను తీసేశాయి. వారంతా ఖాళీగా ఉన్నారు. వారందరికి బోధన తప్ప వేరే విషయం తెలియదు. అందువల్ల పూల్ లాగా ఏర్పడి టీచర్లను మాట్లాడుకుని అతి తక్కువ ఫీజు చెల్లిస్తే సరి. హోం ట్యూషన్ టీచర్లు కూడా బ్యాచ్ లు బ్యాచ్ లుగా విద్యార్ధులకు క్లాసులు తీసుకుంటే వారి నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది.
కార్పొరేట్ కాలేజీల దోపిడికి విద్యార్ధుల తల్లిదండ్రులు, టీచర్లు కలిసి చెక్ పెట్టవచ్చు. ఈ ఒక్క ఏడాది ఈ విధంగా హోం ట్యూషన్లపై కాలం గడిపితే కరోనాకు వ్యాక్సిన్ రాగానే ఈ పద్ధతి బాగుంటే దీన్నే కంటిన్యూ చేయవచ్చు. లేదా పూర్వపు విధానానికి వెళ్లిపోవచ్చునని లలిత్ కుమార్ అంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులూ ఆలోచించండి. మీ పిల్లవాడు సేఫ్. ఖర్చు తక్కువ. దీనికి కావాల్సిన టీచర్లను, లెక్చరర్లను పూలింగ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. కొంచెం తెలివిగా అందిరితో మాట్లాడితే సరిపోతుంది.