నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో దళిత మాల యశోద మరణానికి కారణమైన సుదర్శన్ రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలని మాలల చైతన్య సమితి డిమాండ్ చేసింది. దామరగిద్ద మండలం గత్ప గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి సదర్ గ్రామానికి చెందిన దళిత మాల యశోద (20) కు మాయ మాటలు చెప్పి ఆమెను ఒప్పించి శారీరకంగా వాడుకొని వదిలేశాడని దాంతో మనోవేదనకు గురై పాయిజన్ తీసుకొని జనవరి 18న ఆమె ఆత్మహత్య చేసుకుందని మాలల చైతన్య సమితి తెలిపింది.
కులాంతర వివాహం చేసుకుంటా అని మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తిని శిక్షించాల్సిందేనని వారు కోరారు. ఆమె చావుకు కారణమైన సుదర్శన్ రెడ్డి పై దామరగిద్ద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమానాస్పద కేసు మాత్రమే నమోదు చేశారని, హత్య కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని వారన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా అనుభవించిన సుదర్శన్ రెడ్డికి పెళ్లి చేసుకో అనేసరికి అప్పుడు కులం అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు.
ప్రేమ పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి వాళ్ళ చావుకు కారణం అవుతున్న మృగాలను విడిచిపెట్టరాదని వారన్నారు. నిందితుడిని ప్రజా కోర్టులో బహిరంగంగా ఉరితీయాలని యశోద బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని సంబంధిత అధికారులను మాలల చైతన్య సమితి హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య, మంత్రి వెంకట్రాములు, ఎం కాంతారావు, మంత్రి యాదగిరి, మంత్రి కృష్ణ పాల్గొన్నారు.