నాగర్ కర్నూల్ జిల్లా లోని ఒక గ్రామం పరిస్థితి ఇది….. తమ పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి అక్కడి పెద్దలు ఎంతో తంటాలు పడుతున్నారు… నిజం. ఇది పెంట్లవెల్లి మండలంలో జరుగుతున్న కథ. అక్కడి మల్లేశ్వరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. ఏం చేయాలి….? విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉంటే నాణ్యమైన విద్య అందుతుందని పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుగం నరసింహ్మ యాదవ్, యూత్ కాంగ్రెస్ పెంట్లవెల్లి మండల అధ్యక్షులు భోగ్యం నరసింహ్మ నాయుడు అనుకుంటున్నారు.
అయితే అలా జరగడం లేదు. తమ విద్యార్ధులు ఎంతో నష్టపోతున్నారని వారికి అర్ధం అయింది. దాంతో ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఖర్చుతో ప్రతి నెల 6000 రూపాయలను ఆ వాలంటీర్ కు జీతంగా ఇస్తున్నారు. ఈరోజు ఆ గ్రామంలో జరిగిన “మన ఊరు మన బడి”కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆ విద్యా వాలంటీర్ కు వేతనం అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పాఠశాల “మన ఊరు మన బడి”పథకానికి ఎన్నికైనందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.