రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖమ్మం లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పువ్వాడ మాట్లాడుతూ పొంగులేటి ఆర్ధిక నేరస్తుడని, తనతో ఉండేవాళ్లంతా రౌడీ షీటర్లని, బంకులను, రైతులను మోసం చేసిన
వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పొంగులేటి ఖమ్మం లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ పై విమర్శలు చేశారు. ఒక బచ్చా గాడిని పోటీలో పెట్టి పువ్వాడను ఒడిస్తామని, నాలుగు వేధి లైట్లు వేసి అభివృద్ది చేశామని చెపుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో పువ్వాడను ఓడించటమే లక్ష్యంగా
పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా పొంగులేటి వ్యాఖ్యలపై పువ్వాడతో పాటు ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పువ్వాడ పుట్టుక, రాజకీయ నేపధ్యం అంతా ఖమ్మంలోనే జరిగిందని, ఖమ్మంకు పువ్వాడ కుటుంబంతో వున్న అనుబంధాన్ని ఎవరు విడతీయలేరని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబం ఖమ్మం అభివృద్ది లో కీలకంగా పనిచేసిందన్నారు. పొంగులేటి త్వరలోనే కాంగ్రెస్ లోకి వెళ్తారని, పార్టీ మారిన తర్వాత కేసిఆర్ విలువ తెలుస్తుందన్నారు. చిన్న సబ్ కాంట్రాక్టర్ గా వున్న పొంగులేటి వేలకోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు
తెలియచేస్తామన్నారు. ఖమ్మం లో అరాచకశక్తులను అణచివేశామని, నిన్నటివరకు పోలీసులను పొగిడిన పొంగులేటి ఇప్పుడు ఆరోపణలు చేయటం ఆయన నైజాన్ని తెలియచేస్తున్నదన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ప్రజలకు కూడా శఠగోపం పెడతాడని,అందరూ జాగ్రత్తగా వుండాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తాను ఖమ్మం లోనే పోటీ చేస్తానని, ఎవరినైనా ఎదుర్కొనే సత్తా తనకు ఉందని, తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందని పేర్కొన్నారు.