దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య చికిత్సలందించేందుకు ఆలన వాహనం ప్రారంభించామని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలన వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్న వయోవృద్ధులకు జిల్లా ఆసుపత్రిలో వైద్య నిపుణులచే చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలన వాహనాన్ని ప్రారంభించామన్నారు. వాహనంలో డాక్టర్ తో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారని, ప్రతి గ్రామంలో పక్షవాతం, టీబీ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రులలో వైద్య నిపుణులచే చికిత్సలు అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వసంత్ రావు, డా.కార్తీక్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, నాయకులు రాంకిషన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.