అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శిస్తూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్పై ఆప్ నేత రాజీవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు వివాదం నెలకొన్నాయి. పంజాబ్ రాజకీయాల్లో సిద్దు రాఖీసావంత్ వంటివారని ఆప్ నేత రాజీవ్ చద్దా విమర్శించారు.
కాంగ్రెస్ అధిష్టానం నుండి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వరకు అందరితో తిట్లుతిన్న సిద్దు..కొంచెం మార్పు కోసం.. అరవింద్ కేజ్రీవాల్పై పడ్డాడు అంటూ ట్వీట్ చేశారు. రేపటి వరకు ఆగండని, తిరిగి సిద్దూ అమరీందర్ సింగ్పై ప్రేలాపనలు మొదలు పెడతారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నెటిజన్లు… చద్దా వ్యాఖ్యలపై గరం అయ్యారు. చద్దా రాఖీ సావంత్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేజ్రీ నోటిఫికేషన్ పై ట్వీట్..
గత డిసెంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రైతులను దోపిడీకి గురిచేసేలా ఉందంటూ సిద్ధూ ట్విట్టర్లో ఓ వీడియో పెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా ఆప్ సర్కారు వ్యవహారం ఉన్నదని సిద్ధూ ఆ వీడియోలో ఆరోపించారు. అసలు వ్యవసాయ చట్టాలపై ఆప్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సిద్దూ డిమాండ్ చేశారు.
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలలో రైతులు తమ పంటను మండీల వెలుపల అమ్ముకునేందుకు అనుమతించే చట్టం ఒకటి. దీన్ని ఢిల్లీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో నోటిఫై చేసింది. ఈ చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం తొలగించిందా అని ప్రశ్నిస్తూ సిద్ధూ ట్వీట్ చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ రైతుల దోపిడీ కొనసాగుతోందని, పంటలకు ధర రాక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రైవేట్ మండీల చట్టాన్ని అనుమతించిన కేజ్రీవాల్ ఇప్పటికైనా తన నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించారు.
కౌంటరిచ్చిన సిద్ధూ
చద్దా ట్వీట్ పై స్పందించిన సిద్దు..మనిషి నుండి కోతి.. తోకలేని కోతుల నుండి రూపాంతరం చెందాడని చెబుతూ ఉంటారని, మీ విషయంలో అది నిజమేనని, మీరు ఇంకా దిగజారిపోతున్నారని కౌంటరించ్చారు. వ్యవసాయ చట్టాల గురించి తాను అడిగిన ప్రశ్నకు మీరింకా సరిగ్గా సమాధానం ఇవ్వలేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, అకాళీదళ్ మధ్య ప్రధాన పోటీ సాగనున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు హస్తానికి, చీపురుకు కూడా పడటం లేదు. ముందు ముందు ఈ రెండు పార్టీల మధ్య మరిన్ని మాటల తూటాలు పేలటం ఖాయంగానే భావించవచ్చు.