హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల వైద్య అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకొని వెళ్లి అక్కడ పని చేయిస్తున్నారు.
ఇది బాగానే ఉన్నా ఆశా వర్కర్ లను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తున్న సమయంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓకే అంబులెన్స్ లో 20 మంది ఆశా వర్కర్ లను తీసుకొని వెళ్తున్నారు. కరోనా వ్యాధి విస్తరించకుండా సామాజిక దూరాన్ని పాటించాలని ఒక పక్క వైద్య అధికారులు చెబుతూనే, తమ సిబ్బందిని మాత్రం ఒకే అంబులెన్స్ లో పదుల సంఖ్యలో తీసుకొని వెళుతున్నారు.
దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈ సెంటర్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ లను 20 మందిని ఒకే అంబులెన్స్ లో రాంనగర్, దోమలగూడ ప్రాంతాలకు తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.