వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై ACB విచారణకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలన్నింటిపై కూడా సమగ్ర విచారణ జరుగబోతోంది. ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని నిర్వహించింది వైసీపీ సర్కార్. ఈ కార్యక్రమం కింద దాదాపు రూ.119 కోట్లు 45 రోజుల్లోనే ఖర్చు చేసింది. దీనికి సంబంధించి సభలో సభ్యులు ప్రశ్నించగా..క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఐతే రూ.119 కోట్లకు మించి కుంభకోణం జరిగిందిని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కేవలం రూ.119 కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు జిల్లా ఫండ్స్ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానాలను వ్యక్తం చేశారు సభ్యులు. ఈ స్కామ్పై సమగ్రమైన విచారణ జరపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తు ఖర్చుల చేశారని, అంతే కాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని, ఎన్నికలకు ముందు యువతను ప్రలోభపెట్టే విధంగా ఈ క్రీడా సంబరం నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి.
అంతేకాకుండా ముగింపు కార్యక్రమం కోసం రెండు కోట్లు కేటాయించి..ఆఖరి నిమిషంలో మరో మూడు కోట్లు పెంచారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేవలం 45 రోజుల్లోనే విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అనే అనుమానాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని, నాశిరకమైన కిట్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా అనేక అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో పూర్తి స్థాయి విచారణకు మంత్రి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ACB విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ACB రిపోర్టు వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.