అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై త్వరలో వేటుపడనున్నది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శీనివాస్ సొంత మనిషి అయిన సురేష్ బాబును ఆయన కూడా కాపాడే పరిస్థితి నెలకొని ఉన్నదని అంటున్నారు.
దుర్గగుడి లో జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ వారు నివేదిక అందించారు. కనకదుర్గ దేవాలయంలో జరిగిన అవకతవకలకు ఈ వో సురేష్ బాబే ప్రధాన కారణమని ఏసీబీ తన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులు కూడా నివేదికతోపాటు అందజేశారు. శానిటేషన్ టెండర్లు, మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు.
భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరలు గల్లంతైనట్టు కూడా గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్లో లెక్కలు తేలనట్టు నివేదికలో ఏసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవో సురేష్ బాబుపై త్వరలో వేటు పడనున్నట్లు తెలిసింది.
ఆయనను బదిలీ చేస్తారా లేక ఆయనను సస్పెండ్ చేస్తారా అనే విషయం మాత్రం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించాల్సి ఉంది.