తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజారపు అచ్చెంనాయుడు నియమితులు కాబోతున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులు కాబోతున్నారు. ఈ మార్పులు వీలైనంత త్వరగా చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
కళా వెంకటరావు సహజంగా నెమ్మదస్తుడుత కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తట్టుకుని పార్టీ కార్యక్రమాలు నడపాలంటే అచ్చెంనాయుడు లాంటి వ్యక్తి ఉండాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇంతకు ముందు రెండు పేర్లు పరిశీలించినా అచ్చెంనాయుడి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే ఈ మార్పును తక్షణమే ప్రకటించాలా లేక రాబోయే మహానాడులో ప్రకటించాలా అనే అంశంపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.
పార్టీ లో ఏకాభిప్రాయం సాధించి అచ్చెంనాయుడికి పట్టం కట్టాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున పార్టీ అధ్యక్షుడికి కొన్ని స్వతంత్ర బాధ్యతలు ఇవ్వాలని కూడా చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి స్వంతంత్ర బాధ్యతలు ఇవ్వడం ద్వారా తనపై భారం తగ్గించుకోవాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు.