గుంటూరు పోలీసులు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రేవ్ పార్టీలు విస్తృతంగా జరుగుతుండగా మరో వైపు పోలీసు అధికారులే అశ్లీల నృత్యాలు చేస్తున్నారు.
గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీలో భాగంగా స్నేహితులు అందరూ కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా చేశారు.
వాస్తవంగా అయితే ఇలాంటి అసభ్య నృత్యాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని పోలీసులు దాడి చేసి సంబంధిత వ్యక్తుల్ని అరెస్టు చేయాలి. పట్టాభిపురం పోలీసులు అలానే చేశారు.
అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఈ అసభ్య నృత్యాలు చేసిన వారిలో సీఐ కూడా ఉన్నాడు. పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు.
అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఆయన అసభ్య నృత్యాలు చేసిన వీడియోలు కూడా దొరికాయి. దాంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.