నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రోజు చిట్యాల-నార్కట్ పల్లి సరిహద్దులలోని జూనియర్ కాలేజి ఏర్పాటుకు సేకరించిన భూమిని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూర్ మండల విద్యార్థుల సౌకర్యార్థం జూనియర్ కాలేజి ఏర్పాటుకు స్థల సేకరణ చేశామని, కాలేజి ఏర్పాటు విషయాన్ని గతంలోనే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు.
మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జూనియర్ కాలేజ్ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు ఏర్పాటుకు హామీ ఇచ్చారని స్పష్టం చేసారు. మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జూనియర్ కాలేజ్ ను మంజూరు చేయించి విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
అదేవిధంగా నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములన్నీ కాపాడుకుంటామని అన్నారు. చట్ట విరుద్ధంగా అన్యాయంగా భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఎంతటివారైనా చట్ట వ్యతిరేకులే అని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.