వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని భువన చంద్ర టౌన్ హాల్లో నేడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, పెద్దకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్ రావు, జిల్లా కలెక్టర్ శివ శంకర్, జేసి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ని ఏళ్లుగా భూ సమస్యలతో ఇబ్బంది పెడుతున్న ఎందరికో ఈ పథకం ద్వారా మేలు చేకూరుతుంది అన్నారు. బ్రిటీష్ కాలం నాడు భూమి రీ సర్వే మరలా ఇప్పుడు జగనన్న పాలనలో జరగడం సంతోషకరం అని అన్నారు. వందేళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా భూముల రీసర్వే చేపట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు.
ఇకపై రాష్ట్రంలో భూమి కొనుగోలు చేస్తే అది బంగారం కొన్నట్లేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భూసర్వే ద్వారా ఎవరైనా నష్టపోయినట్లు తెలితే ప్రభుత్వమే వారికి నష్టపరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. 2023నాటికి సర్వే పూర్తి చేసి స్పష్టమైన రికార్డులు నిర్వహిస్తామన్నారు. ఇకపై భూ వివాదాలకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. సర్వేకి సంబంధించిన ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని.. భూ యజమానులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మిల్లీమీటర్ కూడా తేడా రాకుండా సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయిస్తున్నామన్నారు. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని. వాటి ఫలాలు ప్రజలకు అందాలన్నారు.
రీ సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే జరగాలని ఆకాక్షించారు. అనంతరం జిల్లాలోని పలువురు రైతులకు భూ హక్కు పత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.