కరోనా వైరస్ పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా దాదాపు రూ.16,500 కోట్ల మేరకు రుణం మంజూరు చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారంనాడు ఏడిబి అధ్యక్షుడు మసస్సూగు ససాక్వా ఈ మేరకు భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు హామీ ఇచ్చారు.
భారత ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం నుంచి దేశంలోని వ్యాపార సంస్థలకు ప్రకటించిన రాయితీలు, పన్ను క్రమబద్దీకరణ తదితర అంశాలు పురోగామి చర్యలుగా ఆయన అభివర్ణించారు.
దేశంలోని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తక్షణ సాయంగా రూ. లక్షా 70 వేల కోట్లను ప్రకటించడం, మహిళలు, పిల్లల సంక్షేమానికి సత్వర చర్యలు తీసుకోవడం భారత్ చేసిన సాహసోపేతమైన నిర్ణయాలని ఏడిబి కొనియాడింది. ఈ కారణాలతో భారత్ కు అత్యవసర ఆరోగ్య సహాయం కోసం తాము నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏడిబి తెలిపింది.
తామిచ్చే నిధులను ఆర్ధిక పునరుజ్జీవనానికి వినియోగించుకోవచ్చునని, చిన్న మధ్య తరగతి వ్యాపార, వాణిజ్య సంస్థలకు అదనపు బలం చేకూర్చేందుకు వినియోగించుకోవాలని ఏడిబి సూచించింది. ఈ నిధులను సమర్ధంగా వినియోగిస్తే మరింత సాయం చేయడానికి కూడా తాము సిద్ధమని ఏడిబి తెలిపింది.