ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ సోయం బాపురావు కోరారు.
పార్లమెంట్లో జీరో అవర్ సందర్భంగా సోయం బాపురావు బైంసా అల్లర్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఎంఐఎం పార్టీ నేతలు గుండాయిజం ప్రదర్శిస్తున్నారని వారికి భయపడి టిఆర్ఎస్ ప్రభుత్వం నిందితులపై సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ప్రతిసారీ జరుగుతున్న దాడుల్లో హిందువులు తీవ్రంగా గాయపడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాళ్లు రువ్వడం, కత్తులు, మారణాయుధాలతో దాడులు విధ్వంసం సృష్టిస్తూ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు.
బైంసా పట్టణం లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారికి రక్షణ లేకుండా పోతుందని సోయం బాపురావు అన్నారు.ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిబిసిఐడి చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.