అదిలాబాద్ -ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని మంగళవారం పార్లమెంట్ సభ్యులు సోయం బాపు రావు గారు కలిసారు. 2017-18 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు 220 km పొడవున 2800 కోట్ల అంచనా వ్యయంతో నిధులు మంజూరు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తో రైల్వే శాఖ జాయింట్ వెంచర్ కింద ఈ రైల్వే పనులు చేపట్టాల్సి ఉండగా ఇక్కడి ప్రభుత్వం సహకరించడం లేదని ఎంపీ తెలిపారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ నుండి ముద్ కేడ్ మీదుగా హైదరాబాద్ కు రైలులో వెళ్లాలంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. నిర్మల్ మీదుగా హైదరాబాద్ కు కొత్త రైల్వే లైను ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలకు 150 కిలోమీటర్ల దూర భారం తగ్గే అవకాశం ఉంది.
ఈ రైల్వే లైను త్వరితగతిన పూర్తిచేసి నిధులు కేటాయించి జిల్లా ప్రజలకు రైల్వే సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి నాందేడ్ మీదుగా బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలును సత్వరమే పొడిగించే లాగా రైల్వే శాఖ అధికారులను ఆదేశించాలని కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే శాఖలో ప్రతిపాదన దశలో ఉన్న ఆదిలాబాద్ లో పిట్ లైన్ మంజూరు చేయాలని కోరారు. మహారాష్ట్రతో అనుసంధానం చేస్తూ ఆదిలాబాద్ నుండి కిన్వత్ మీదుగా నాందేడ్ కు అదనంగా ట్రైన్ మంజూరు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆదిలాబాద్ లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న తాంసి బస్టాండ్ పాయింట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కలిసి ఇ వినతిపత్రం ఇవ్వగా ఇందుకు మంత్రి అంగీకరించారు.