ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ కోసం ముహూర్తం పెట్టుకున్నారు. మూడు రాజధానులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుని అమరావతి నుంచి తరలి వెళ్లిపోవాలని ఆయన స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి ఆయన విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తారు. ఈ మేరకు అందరు సెక్రటరీలకు సమాచారం అందింది.
అన్ని విభాగాల అధిపతులూ సెప్టెంబర్ 20 కన్నా ముందుగానే విశాఖపట్నం తరలి వెళ్లాలని ఆదేశాలు అందాయి. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులు ఈలోపునే తొలగిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు సంబంధించి కౌన్సిల్ లో కూడా ప్రవేశ పెట్టారు.
దానికి సంబంధించిన గడువు కూడా పూర్తి కావడంతో ఆటోమేటిక్ గా బిల్లు ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. తదుపరి రాష్ట్ర గవర్నర్ సంతకం చేస్తే అది చట్టంగా మారిపోతుంది. అందుకోసమే సెప్టెంబర్ 20 ని తాజాగా ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
రాజధాని తరలింపు విషయంలో కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 20న విశాఖపట్నం నుంచి తొలి జీవో విడుదల చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు.