ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు కానుకగా ఒక బృహత్ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు. తల్లి తండ్రితో సహా ఏ ఆధారంలేని ఒక చదువుల తల్లికి రోజా ఆధారంగా నిలిచారు. ఇది ఎవరో అడిగితే చేసింది కాదు.
తిరుపతిలోని బాలల సంక్షేమ అతిధి గృహానికి పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడ పుష్పకుమారి కథ తెలిసింది. పుష్పకుమారి మూడో తరగతి చదువుతున్నప్పుడు అనారోగ్యంతో ఆమె తండ్రి చనిపోయాడు. వంటరి తల్లి ఆ పాపను చదివించి పెద్ద చేసింది. అయితే విధి మరోలా ఆలోచించింది.
పుష్ప కుమారి ఎనిమిదో తరగతి చదువుతుండగా తల్లి కూడా మరణించింది. ఆ పాప ఏం చేయాలి? ఇంత పెను కష్టంలోనూ చదువును వదల్లేదు. ప్రభుత్వ సంక్షేమ గృహంలో ఉంటూ చదువుల్లో రాణించింది. రాణిస్తూనే ఉంది. పుష్పకుమారి తాను డాక్టర్ కావాలని కలలు కంటున్నది.
పెద్ద డాక్టర్ అయి పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యంగా పుష్పకుమారి చెబుతున్నది. ఇంతటి గొప్ప ఆదర్శం ఉన్న ఆ అమ్మాయికి ఆదర్శ అభ్యుదయ భావాలు ఉన్న ఎమ్మెల్యే రోజా అండగా నిలిచారు. పుష్పకుమారి వైద్య విద్య అభ్యశించడానికి అయ్యే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు.
పుష్పకుమారి భవిష్యత్తుకు అండగా నిలిచారు. అమ్మవొడి పేరుతో పథకం ప్రవేశపెట్టి ఎందరో బాలల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న జగనన్న పుట్టిన రోజుకు తాను ఇచ్చే కానుక ఇదేనని రోజా చెబుతున్నారు. జగనన్న పుట్టినరోజున #bbbbroja #AdoptGirlChild అంటూ సామాజిక మాద్యమంలో చాలెంజ్ చేశారు.
తలిదండ్రుల ప్రేమకి నోచుకోని వారికి ప్రేమని పంచమని మనకు ఇష్టమైన వారి పుట్టినరోజు దీనికి పునాది కావాలని సందేశం సమాజానికి చాటి చెప్తుతున్న ఎమేల్యే ఆర్కే రోజా విడుదల చేసిన లఘుచిత్రానికి అటు సినీరాజకీయ ప్రముఖులు పార్టీలకి అతీతంగా అభినందిస్తున్నారు.