హైకోర్టుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన ఒక న్యాయవాదిని గుజరాత్ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా పేర్కొంది. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేసిన నేరంపై గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ యతిన్ ఓజా పై తనంతట తానుగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.
కొందరు పారిశ్రామికవేత్తలకు, స్మగ్లర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పులిస్తున్నదని యతిన్ ఓజా అనే న్యాయవాది జులైలో తన ఫేస్ బుక్ లైవ్ లో ఆరోపించాడు. అసంబద్ధమైన, అసత్యమైన ఆరోపణలు చేస్తూ హైకోర్టును తప్పుపట్టిన ఓజా దోషి అని జస్టిస్ సోనియా గోకానీ, జస్టిస్ ఎన్ వి అంజారియా పేర్కొన్నారు.
తనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు కావడంపై ఓజా సుప్రీంకోర్టుకు వెళ్లగా కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని వెల్లడించింది.
తాను బేషరతుగా క్షమాపణ చెబుతానని సుప్రీంకోర్టుకు విన్నవించగా అన్ని విషయాలూ హైకోర్టులోనే తేల్చుకోండని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గుజరాత్ హైకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.