న్యాయవాదుల జంట హత్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే అందులో అయన పాత్ర ఉన్నట్లే భావించాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు.
న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్యోదంతం నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వామన్ రావు దంపతుల పార్థివదేహాలను నేడు ఆయన సందర్శించారు.
అనంతరం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం స్పందించాల్సిందే.
దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు బాధిత కుటుంబం, న్యాయవాదుల పక్షాన పోరాడుతాం అని బండి సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.