బురద దుక్కి దున్నడం మొదలుకొని,నాటు వేసే వరకు రోజంతా పనిలో నిమగ్నమయ్యారు ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. సోమవారం బోనాల పండుగ సందర్భంగా సెలవు కావడంతో ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్ళారు. ములుగు జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో తోకల లక్ష్మి, రాజిరెడ్డి దంపతుల వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో బురద కొట్టి, గొర్రు పట్టి జంబుకొట్టారు. మహిళ కూలీలతో కలిసి నాటు వేశారు.
మధ్యాహ్నం అందరితో కలిసి అన్నం తిన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై మక్కువతో సెలవు దొరికిన ప్రతి సారి రైతులకు చేదోడు వాదోడుగా తస్లీమా నిలుస్తుంటారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ సమస్తానికి అన్నం పెట్టే రైతన్న కష్టం తనకు తెలుసునని, మనకు అన్నం పెట్టడం కోసం ఎండనక, వాననక ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని తస్లీమా కోరారు, కూలీ పని చేసినందుకు గాను తస్లీమా కు 500 రూపాయలు కూలీ డబ్బులు చెల్లించారు. తనకు ఇచ్చిన కూలీ డబ్బులను మరొక నిరుపేద కూలీకి తస్లీమా అందించారు.