తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూ క్రమబద్దీకరణ పథకం అశాస్త్రీయమని, లోప భూయిష్టమని ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు.
కరోనా నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు వ్యాపారాలు లేక, పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
చిన్నా భిన్న మైన ఆర్ధిక-ఆరోగ్య జీవన పరిస్థితులతో కాలానికి ఎదురీదుతున్న ప్రజలకు ఉపశమన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, కేవలం ఖజానా నింపడానికి , ధనార్జనే ధ్యేయంగా ఈ నూతన భూ క్రమబద్దీకరణ పథకం ప్రవేశ పెట్టిందని విమర్శించారు.
ఈ నూతన భూ క్రమబద్దీకరణ పథకం పై ఆదిలోనే ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సామాన్యులు సైతం ఈ నూతన పథకంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అనడానికి నిదర్శనం అన్నారు.
ఈ విధంగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నింపిన ఖజానా, సంపద ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికేనని, ఈ కుట్రను గమనించి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారని తెలిపారు.
ప్రజల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చకముందే, ప్రతి పక్షాలతో చర్చించి చట్టబద్దమైన, శాస్త్రీయమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సహేతుక విధానాలను ప్రవేశ పెట్టాలని వంశీ చంద్ రెడ్డి డిమాండ్ చేశారు.