పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వీరభద్రరావు, ఆంగ్ల విభాగాధిపతి పి. ఆంజనేయులు, వ్యాయామ విభాగాధిపతి వి ఎస్ వి ఎస్ బాపూజీ లు నేడు పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం వారికి ఘనంగా సన్మానం చేసింది. సభకు అధ్యక్షత వహించిన విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎం బి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ కాలేజీ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైనదని అన్నారు.
భారత విద్యా వ్యవస్థలో ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రాధాన్యత ఎంతో విశిష్టమైనదని అందువల్ల వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. అటానమస్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె ఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ బోధనలో నాణ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త ఎయిడెడ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజి కరస్పాండెంట్ కొండ హరిరామకృష్ణంరాజు మాట్లాడుతూ సర్ సి ఆర్ రెడ్డి కాలేజీ విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరని అన్నారు.వైస్ ప్రిన్సిపాల్ కె ఏ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ అనుభవం, అంకిత భావం గల అధ్యాపకులు పదవీ విరమణ చేయడం కళాశాలకు తీరని లోటు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి జి కోర్సుల డైరెక్టర్ డాక్టర్ కె ఏ రామరాజు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది. పుర ప్రముఖులు పాల్గొన్నారు.